
రూ.13,444 కోట్లతో వార్షిక రుణప్రణాళిక
విజయనగరం అర్బన్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విడుదల చేశారు. గత ఏడాది కన్నా 19.20 శాతం అదనంగా ఈ ఏడాది రుణ ప్రణాళిక వ్యయం పెంచినట్టు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.8,025 కోట్లను కేటాయించామన్నారు. ఎంఎస్ఎంఈ కింద ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా రుణాల కోసం రూ.1,843 కోట్లను కేటాయించామని చెప్పారు. విద్య, గృహ నిర్మాణరంగాలకు రూ.282 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. శతశాతం రూణాలు అందజేసేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. నవంబర్ నెలలో తుఫాన్లు వచ్చే అవకాశం ఎక్కువని, అక్టోబర్ నాటికే వరిపంట కోత పూర్తయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకానికి 86,386 దరఖాస్తులు అందగా స్టేజ్ 3 వెరిఫికేషన్ అనంతరం 6,182 దరఖాస్తులను ఆమోదించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణమూర్తి, నాబార్డు డీడీఎం నాగార్జున, జిల్లా అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.