
వ్యవసాయరంగంపై చిన్నచూపు
రేగిడి: కూటమి ప్రభుత్వం వ్యవసాయరంగంపై చిన్నచూపు చూస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. రేగిడికి శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకు రైతు సేవా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు అందకపోవడం దారుణమన్నారు. రైతు సేవా కేంద్రాలకు నేటికీ విత్తనాలు రాకపోవడంతో ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకునే దుస్థితి నెలకుందన్నారు. చెరకు, మొక్కజొన్న పంటలకు ఎరువులు అందజేసే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్, రబీ సీజన్లు గడిచిపోయాయి.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చిన అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి రైతన్నకు అందలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు పుష్కలంగా అందేవని తెలిపారు. సమావేశంలో బీసీసెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు కింజరాపు సురేష్, లక్ష్మీపురం సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.