● జిల్లాలో వెయ్యి ఎకరాల వరకు సాగు
● విత్తనశుద్ధి తప్పనిసరి
● విత్తన ఆదా ముఖ్యం
● నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలి
సీతంపేట: జిల్లాలో నాణ్యమైన పసుపు దిగుబడికి సీతంపేట ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడ పండిన పసుపునకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పసుపు పంట సాగులో ఉండగా సీతంపేట ఏజెన్సీలోనే కొండ పోడు వ్యవసాయంలో 650 ఎకరాల్లో సాగవుతుంది. గిరిజనులు ప్రతీ ఏటా సాగును పెంచుతున్నారు. ఈ క్రమంలో పసుపు సాగుకు ఈ నెలలోనే అనువైన సమయమని హర్టీకల్చర్, వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే పసుపు బంగారమే అవుతుందంటున్నారు. పసుపు పంట సాగు దశలో ప్రధానంగా విత్తన ఎంపిక కీలకమైంది. ఈ విత్తనాన్ని ఎన్నుకునేటప్పుడు తెగళ్లు, చీడపీడలు లేని నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకోవాలి. ఖరీదైన పంటలను సీజన్లో సమయానికి వేయకపోతే దుంపపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏజేన్సీలో ఆధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోను పసుపు సాగు చేస్తారు. దీని సాగుకు ఈ నెల చివరి వరకు సరైన ఆదును సమయం. జూలై నెలలో పసుపు సాగు చేస్తే బాగా దిగుబడి తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు.
ఎంత విత్తనం వేయాలంటే..
విత్తనం ఎకరానికి కాడి రకం సాధారణంగా ఏజెన్సీలో 6 పుట్లు (పుట్టి 300 కిలోలు) 1800 కిలోలు వేస్తారు. కొంత మంది రైతులు 5 పుట్లు కూడా విత్తనంగా వేస్తారు. ఆయా పరిస్థితులను బట్టి విత్తనంగా వేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పద్ధతులు ఆమలులో ఉన్నాయి. విత్తనంలో కనుపు వద్ద విరిచి చిన్న ముక్కలుగా చేసుకుని విత్తనంగా వేసుకోవచ్చు. దీంతో విత్తనం ఆదా కావడంతో పాటు రైతుకు ఖర్చు కూడా తగ్గుతుంది. పసుపు పంట సాగుకు బలమైన నేలలు శ్రేష్టమైనవి. నల్ల, బంక నేలల్లో పసుపు సాగు చేయవచ్చు. గరప, చౌడు నేలలు పనికిరావు.
విత్తనశుధ్ధి తప్పనిసరి
విత్తనాన్ని పొలంలో నాటే ముందు లీటరు నీటిలో మూడు గ్రాముల కార్బండిజమ్ లేదా డైథేన్ ఎం–45ను కలిపిన ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. విత్తనం ఉంటైనా, కోమ్మైన 40 నిమిషాలు ఈ ద్రావణంలో నానబెట్టాలి.
విత్తనాన్ని డ్రమ్ము నుంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టాక ఆ తర్వాత విత్తనం పూడ్చాలి. శిలీంధ్ర నాశని వల్ల వచ్చే తెగుళ్ల నివారణకు మూడు మిల్లీలీటర్ల డైమిథోయేట్ ద్రావణంలో ట్రెకోడెర్మావిరిడి పొడి 3 గ్రాములు కలిపి విత్తనశుద్ధి చేసుకుంటే తెగుళ్లను చాలా వరకు నివారించవచ్చు.
నాటే విధానంలో జాగ్రత్తలు పాటించాలి
పసుపు విత్తనాన్ని మూడు రకాల పద్ధతుల్లో నాటుకోవచ్చు. ఇందులో ఎత్తుమడుల పద్ధతి, సమతల పద్ధతి, బోదే పద్ధతి. ఎత్తుమడుల పద్ధతిలో మీటరు వెడల్పు కలిగిన కయ్యల్లో 30 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన బోదెలు ఉండేలా చుసుకోవాలి. అదే విత్తన ఉంటను 15 సెంటీమీటర్ల ఎడమతో పూడ్చుకోవాలి. పసుపు పంటకు సోకే తెగుళ్లలో దుంప కుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు వేరు వ్యవత్థ ద్వారా వ్యాపిస్తాయి. విత్తన శుద్ధి చేయకుండా కొమ్మలను ఉంటలను పూడ్చకూడదు. పొలంలోని మురుగు నీరు బయటకు వెళ్లిపోయేలా చేసుకోవాలి. మొక్కల చుట్టూ నీరు నిల్వ లేకుండా చేయాలి. పొటాష్ ఎరువులను సక్రమంగా వేయకపోవడం వల్ల ఇవి వ్యాప్తిస్తాయి. దీనికి మూల కారణం విత్తన శుద్ధి తప్పక చేయాలి.
జాగ్రత్తలు పాటించాలి
పసుపు పంటకు అధికంగా ఎరువుల వినియోగించకూడదు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దుక్కి దున్నే సమయంలో ఎకరాకు 3 బస్తాల సూపర్ పాస్ఫేట్, 200 కిలోల వేప పిండి, 25 కిలోల పొటాష్ను వేయాలి. ఆ తర్వాత విత్తనం పూడ్చిన 40 రోజులకు ఒక బస్తా యూరియా వేయాలి. మూడవ విడత 80 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్, 200 కిలోల వేప పిండి వేసుకోవాలి. నాలుగో విడత 120 రోజులకు బస్తా యూరియా, 25 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా శాసీ్త్రయ పద్ధతిలో ఎరువులను వేయడం వల్ల ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది.
ఆకులను మల్చ్గా ఉపయోగించాలి
పంట విత్తిన వెంటనే హెక్టార్కు 12–15 టన్నుల పచ్చని ఆకులను మల్చ్గా ఉపయోగించాలి. కలుపు తీయడం,భూమిని పైకెత్తి, నాటి న 40–90 రోజుల తర్వాత హెక్టార్కు 7.5 టన్నుల చొప్పున మల్చింగ్ పునరావృతం చేయాలి. పసుపును రైజోముల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఒక ఎకరం భూమిలో నాటడానికి వెయ్యి కిలోల రైజోముల విత్తన రేటు అవసరం. – పి.జయశ్రీ,
ఉద్యానవనశాఖ అధికారి, సీతంపేట
పసుపు సాగుకు సమయమిదే..!