
పిడుగుపాటుకు గురై మహిళ మృతి
తెర్లాం: పిడుగు పాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం విజయరాంపురం ఉరఫ్ బూరిపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు.. విజయరాంపురం గ్రామానికి చెందిన పూడివలస వెంకటమ్మ(40) పిడుగు పాటుకు గురై మృతి చెందింది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అదే సమయంలో వెంకటమ్మ పశువులకు దాణా పెట్టేందుకు పశువులశాలకు వెళ్లింది. ఆ సమయంలో పెద్ద శబ్ధంతో పిడుగు పశువుల శాల పక్కనే పడడంతో పశువుల శాలలో ఉన్న వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతిరాలికి భర్త రామిశెట్టి, ఇద్దరు వివాహితులైన కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కామేశ్వరికి గతంలో వివాహం జరగగా, 10 రోజుల క్రితమే చిన్న కుమార్తె గౌరీశ్వరికి వివాహమైంది. అంతవరకు ఇంట్లో ఉండి పశువులకు దాణా పెట్టి వస్తానని చెప్పి పశువుల శాలకు వెళ్లిన వెంకటమ్మ పిడుగుపాటుకు గురై మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తహసీల్దార్ హేమంత్కుమార్కు గ్రామ సర్పంచ్ బూరి మధుసూదనరావు సమాచారం ఇవ్వగా వెంటనే తహసీల్దార్ గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని, మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. తెర్లాం ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహానికి శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు.
పాము కాటుకు గురై వ్యక్తి..
తెర్లాం: పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తెర్లాం మండలం సింగిరెడ్డివలస పంచాయతీ బొంగుపేట గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్ఐ సాగర్బాబు శుక్రవారం తెలిపిన వివరాలు.. బొంగుపేట గ్రామానికి చెందిన ఏగిరెడ్డి లక్ష్మునాయుడు(59) పాము కాటుకు గురై మృతి చెందాడు. బుధవారం రాత్రి కళ్లానికి వెళ్తుండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాజాంలోని సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు లక్ష్మునాయుడుకి సత్యవతి, వివాహితులైన పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ఆసుపత్రిలో శవ పంచనామా చేసి అక్కడే పోస్టుమార్టం చేయించారు.
జ్వరంతో వ్యక్తి..
సీతంపేట: మండలంలోని జగతపల్లి గ్రామానికి చెందిన సవర ఆనందరావు (26) అనే గిరిజనుడు జ్వరం, వాంతులు, విరేచనాలు, ఆయాసంతో బాధపడుతూ పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనందరావు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా గురువారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ప్రైవేటు ఆసుపత్రికి శుక్రవారం ఉదయం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య మేఘన, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతల బెలగాం దాటి పరసపాడు గ్రామ సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చినమేరంగి గ్రామానికి చెందిన ముదిలి దినేష్(26) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... దినేష్ తన భార్య దివ్యతో బయటకు వెళ్లి వస్తానని గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో పల్సర్ బైక్పై బయలుదేరాడు. పరసపాడు సమీపంలో ముందు టేకు కర్రలతో వెళ్తున్న నాటుబండిని ఢీకొని పడిపోయాడు. స్థానికులు 108లో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దినేష్కు భార్య దివ్య, మూడేళ్ల కుమార్తె దీక్షితశ్రీ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.అనీష్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా టేకు కర్రలతో వెళ్తున్న బండికి వెనుక భాగాన ప్రమాద సూచిక ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
పాలకొండ రూరల్: కుటుంబ పోషణకు రైతు వారీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న సన్నకారు రైతు పొలం నుంచి ఇంటిబాట పడుతున్న క్రమంలో విధి వక్రించింది. రోడ్డు దాటుతున్న క్రమంలో ద్విచక్ర వాహన రూపంలో మృత్యువు కబలించింది. ఎస్ఐ కె.ప్రయోగమూర్తి తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం గ్రామానికి చెందిన గర్భాన లక్ష్ముం(62) ఉపాధి పనులతో పాటు పొలం పనులు పూర్తి చేసుకుని శుక్రవారం సాయంత్రం ఇంటికి వస్తున్నా రు. గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొండ నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వె ళ్తున్న యాకుల రఘు తన వాహనంతో లక్ష్ముంను ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రుడిని స్థానికులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్ముం మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న భార్య అన్నపూర్ణ, ముగ్గరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.

పిడుగుపాటుకు గురై మహిళ మృతి

పిడుగుపాటుకు గురై మహిళ మృతి

పిడుగుపాటుకు గురై మహిళ మృతి