
నగరంలో భారీ వర్షం
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం గంట సమయం ఏకధాటిగా కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో విలవిలలాడిన అన్ని వర్గాల ప్రజలు మధ్యాహ్నం కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం పొందారు. ఇదిలా ఉండగా భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయనగరం చింతలవలస వెళ్లే మార్గంలోని ధర్మపురి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగటంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ యంత్రాంగం జేసీబీ సహాయంతో వృక్షాన్ని తరలించటంతో సమస్య పరిష్కారమైంది. ఇదిలా ఉండగా ఎప్పటిలానే భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం:
నగరంలో చిన్నపాటి వర్షానికి గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తున్న సందర్భంలో ఇదే సమస్య ఉత్పన్నమవుతుండగా... సరఫరా పునరుద్ధరణకు గంటల తరబడి సమయం పడుతుండటం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా మరల సాయంత్రం 5 గంటల తరువాత పునరుద్ధరించటం ఇందుకు తార్కాణంగా నిలుస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి ముందుగానే విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ పేరిట విద్యుత్ లైన్ల వెంబడి ఉండే చెట్లు, చెట్లు కొమ్మలు తొలగించే చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం లేకపోతుంది. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
3 గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు
అంతరాయం