
జిల్లాలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన
విజయనగరం అర్బన్: జిల్లాలోని జలవనరులను పరిశీలంచి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోడానికి కేంద్ర జలశక్తి అభియాన్ బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. తొలుత కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను బృందం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వారి పర్యటన వివరాలను తెలియజేశారు. జిల్లాలో తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులను సందర్శిస్తామని, కోటగండ్రేడులో జలజీవన్ మిషన్ లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతామని కలెక్టర్కు తెలియజేశారు. బృందంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ తరుణా దోలియ, కేంద్ర వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ నిఖిల్ జెఫ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త డి.అనంతరావులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ప్రాజెక్ట్ డీఈఈ గోవిందరావు, తోటపల్లి ఎస్ఈ స్వర్ణకుమార్, ఈఈ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
వెనుకబడిన జిల్లాకు నిధులు మంజూరు చేయాలి
కేంద్ర జలశక్తి అభియాన్ బృందంతో కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ విజయనగరం వెనుకబడిన జిల్లా అని, కేంద్ర ప్రాజెక్టుల కోసం నిధులను కేటాయించాలని కోరారు. తారకరామ తీర్ధ సాగర్పై బృందానికి వివరిస్తూ ఈ ప్రాజెక్టు కోసం రూ.800 కోట్లతో అంచనా ప్రతిపాదనలు పంపగా రూ.100 కోట్లు మాత్రమే ఇప్పటివరకు మంజూరయ్యాయని ఆర్అండ్ఆర్ చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని మిగిలిన నిధులు మంజూరు చేస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని తెలిపారు.
మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిసిన బృంద సభ్యులు