
ప్రజల సమస్యలను పరిష్కరించాలి
పార్వతీపురంటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశమందిరంలో కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 63 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోపు అర్జీదారు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, పునఃపరిశీలన లేకుండా సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని తెలిపారు.
పీజీఆర్ఎస్కు 32 వినతులు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు వచ్చాయి. జమ్మడుగూడ గ్రామానికి చెందిన సవర కళ్యాణ్ రహదారి మంజూరు చేయాలన్నారు. చిన్నపొల్లకు చెందిన శ్రీలత కుట్టుమిషన్ ఇప్పించాలని కోరారు. మామిడి, జీడి మొక్కలు పంపిణీ చేయాలని కురసింగి గ్రామస్తులు వినతి ఇచ్చారు. కోడిశ గ్రామస్తుడు హెచ్.రవి వన్బి అడంగల్ ఇప్పించాలన్నారు. ట్రాక్టర్ లోన్ మంజూరు చేయాలని పద్మాపురం గ్రామస్తుడు మనోసింగు కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, పీహెచ్వో ఎస్.వి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
పార్వతీపురం రూరల్: ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఉత్తర్వుల మేరకు పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురానా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన నాలుగు ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం సమస్యలను సంబంధింత పరిధిలో ఉన్న స్టేషన్ అధికారులకు అప్పగించి వాటిని దర్యాప్తు చేసి తక్షణ చర్యలు చేపట్టి జిల్లా పోలీసుశాఖ కార్యాలయానికి నివేదికను పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్కు అందిన విజ్ఞప్తులలో కొన్ని..
ముత్యాల సెంటర్ నుంచి కొత్తం గ్రామం వరకు మెయిన్ రోడ్డు మంజూరు చేయాలని సీతంపేట మండలం కొత్తం గ్రామానికి చెందిన సవర.గంగయ్య అర్జీ అందజేశారు.
వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన సీహెచ్. దుర్గమ్మ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తూ 2022 జూలైలో పదవీ విరమణ పొందియున్నానని, ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ అందలేదని, బెనిఫిట్స్ మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
పార్వతీపురం మండలం గదబవలస గ్రామానికి చెందిన కె. జగన్నాథం జీవన ఉపాధికోసం ట్రాక్టర్ కొనడానికి ప్రభుత్వం రుణం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన సీహెచ్ అశోక్(ఎస్టీ కొండదొర) కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎంవీ కరుణాకర్, జిల్లా ప్రణాళిక అధికారి ీపి.వీర్రాజు, డ్వామా పీడీ కె. రామచంద్రరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. రాబర్ట్ పాల్, ఉద్యానవనశాఖ అధికారి బి.శ్యామల, పశుసంవర్థక శాఖ అధికారి డా.ఎస్.మన్మథరావు, డీఆర్డీఏ ఏపీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, డీఎంహెచ్ఓ డా.ఎస్.భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు ఆర్.కృష్ణవేణి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించాలి

ప్రజల సమస్యలను పరిష్కరించాలి