
టన్ను పీడీఎస్ బియ్యం పట్టివేత
● డీలర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టిన నాలుగు రోజుల్లోనే బట్టబయలైన అక్రమరవాణా
● రేషన్షాపు నుంచి అక్రమమార్గంలో రైస్ మిల్లులకు తరలింపు
● డీలర్లకు వరంలా మారిన రేషన్ పంపిణీ పాతవిధానం
బొండపల్లి: గతప్రభుత్వం పారదర్శకంగా, ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటి రేషన్ సరుకుల పంపిణీకి మంగళం పాడాలని మొదటి నుంచి ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా ఏడాది వరకు కొనసాగించి జూన్ నెల నుంచి రేషన్ షాపుల్లో డీలర్ల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టి అమలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా రేషన్ షాపుల డీలర్లు, గతంలో అక్రమంగా రేషన్ బియ్యం ఇతర సరుకులను బ్లాక్ మార్కెట్లోకి తీసుకువెళ్లి సొమ్ము చేసుకున్న వారు..తమ పాత అక్రమాలకు మళ్లీ పాల్పడుతూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ సరుకులను పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమయ్యారు.
నాలుగు రోజులకే అక్రమ రవాణా
రేషను సరుకులను డీలర్ల ద్వారా పంపిణీని కూటమి ప్రభుత్వం ప్రారంభించి నాలుగు రోజులు కూడా పూర్తి కాకముందే, డీలర్లు, అక్రమాక్కులు కుమ్మకై ్క అక్రమమార్గంలో రేషన్ సరుకులను తరలించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా విజయనగరంలోని గుంకలాం నుంచి గొట్లాం బైపాస్ రోడ్డు మీదుగా గజపతినగరం తరలిస్తున్న టన్ను పీడీఎస్ బియ్యాన్ని బుధవారం వేకువ జామున విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలంతో పాటు సివిల్ సప్లయిస్ డీటీ కె.తిరుపతిరావు అధికారులతో కలిసి పట్టుకుని బొండపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.45వేల 500 ఉంటుందని, ఆటోలో తరలిస్తుండగా ఆటో యజమాని గేదేల ఈశ్వర్రావుతో పాటు సహాయకుడు దాసరి శ్రీనును అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా గజపతినగరానికి చెందిన ముప్పిడి గణేష్కు బియ్యం తరలిస్తున్నట్లు తెలపడంతో అక్రమ రవాణాకు పాల్పడుతున్న అందిరిరీ అదుపులోకి తీసుకుని వారిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.