
యోగాంధ్ర అర్బన్ లెవెల్ పోటీలు
విజయనగరం: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 అర్బన్ స్థాయి పోటీలను విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక రాజీవ్ స్టేడియంలో యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, మెడిటేషన్కు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు అర్బన్ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఈనెల రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అర్బన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పీడీలు, పీఈటీలు, యోగా శిక్షకులు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
375 గ్రాముల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు గంజాయి విక్రయదారులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పెద్ద చెరువు రామానాయుడు రోడ్డులో కొంతమంది వ్యక్తులు గంజాయి పీలుస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఉడాకాలనీకి చెందిన వజ్జల భరత్ కుమార్, లంకాపట్నానికి చెందిన చిన్న మనోహర్లు గంజాయి పీలుస్తూ, విక్రయాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు.వారి దగ్గర నుంచి 375 గ్రాముల గంజాయి, రూ.350 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.

యోగాంధ్ర అర్బన్ లెవెల్ పోటీలు