
ఐదుగురు గంజాయి నిందితుల అరెస్ట్
డెంకాడ: డెంకాడ మండలం బెల్లాం గ్రామం దగ్గరలో గల భాష్యం లే–అవుట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి వినియోగిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డెంకాడ ఎస్సై ఎ.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, యాంటీ గంజాయి టీమ్ జూన్ 2న దాడులు నిర్వహించి, గంజాయి పీలుస్తూ, విక్రయాలకు పాల్పడుతున్న ఒక జువైనల్ సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అరెస్టయిన వారి నుంచి 1.330కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లు, రూ.200 నగదును డెంకాడ ఎస్సై సన్యాసినాయుడు సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో ఎ–1 జామి మండలం అలమండ గ్రామానికి చెందిన దాసరి గాంధీ (24) గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. అదేవిధంగా డెంకాడ మండలం బెల్లాం గ్రామానికి చెందిన జుతిక శ్యామ్ (ఎ–2, 19 సంలు) మాల్లపురెడ్డి రాకేష్ (ఎ–3) దిబ్బగుడ్డి గ్రామానికి చెందిన మల్లపురెడ్డి వేణు (ఎ–4) సహా జువైనల్(5) గంజాయి పీలుస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ వివరించారు. గంజాయి విక్రయాలు జరిపిన వ్యక్తితో సహా, గంజాయి వినియోగిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.