
బండెమ్మ తల్లి హుండీల చోరీ
శృంగవరపుకోట: పధ్నాలుగు ఏళ్ల తర్వాత ఎస్.కోట మండలంలోని సీతంపేట గ్రామంలో వేడుకగా జరిగిన జరిగిన బండెమ్మ తల్లి పండగ భక్తుల్లో కొత్త ఉత్సాహం నింపినా, వారి మనోభావాల్ని మాత్రం దొంగలు దెబ్బకొట్టారు. ఆదివారం రాత్రి అమ్మవారి అనుపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 12గంటల వరకూ అమ్మవారి ఆలయం వద్ద సందడిగానే ఉంది. రాత్రి 12గంటల సమయంలో అనువంశిక అర్చకులు, పెద్దలు అమ్మవారికి చెల్లించాల్సిన కానుకలు, ముడుపులు చెల్లించి ఇళ్లకు వెళ్లారు. అమ్మవారి ఆలయం వద్ద సందడి సద్దుమణగగానే దొంగలు పక్కాగా ప్లాన్ అమలు చేశారు. రాత్రి 12గంటల తర్వాత ఆలయంలో ఉన్న స్టీల్, ఐరన్ హుండీలను ఎత్తుకుపోయారు. స్టీల్ హుండీ పగలగొట్టి పక్కన ఉన్న పశువుల పాకలో పడేశారు. ఇనుప హుండీని మాత్రం పట్టుకుపోయారు. 14 ఏళ్ల తర్వాత పండుగ జరగడంతో అమ్మవారికి ఆదాయం దండిగానే వచ్చింది. సుమారు లక్ష రూపాయలు చోరీకి గురైఉంటాయని గ్రామ పెద్దలు చెబుతున్నారు. చోరీ విషయం తెలుసుకున్న ఎస్.కోట పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటూ ఎస్.కోట పోలీసులు చెబుతున్నారు.