
కరాటేలో బాలుడి ప్రతిభ
సీతంపేట: విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో పెద్దూరుకు చెందిన ఆరిక యాగ్నిక్ మంచి ప్రతిభ కనబర్చాడు. పోటీల్లో మొదటి బహుమతి సాధించడంతో యగ్నిక్ను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం గ్రామ శివారులోని ఎర్రచెరువు ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పత్తిక రాంమోహన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట గ్రామంలోని ప్రతిభాభారతి కాలనీకి చెందిన రాంమోహన్ ఆదివారం కురుపాంలో పనులు ముగించుకుని లగేజీ ఆటోతో తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తుండగా కురుపాం దాటగానే వచ్చే ఎర్రచెరువు మలుపువద్ద ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొన్నాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన సాటి వాహనదారులు లగేజ్ ఆటోలో ఇరుక్కున్న రాంమోహన్ను బయటికి తీసి అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం 108 సిబ్బంది తరలించారు. తలకు చిన్నపాటి గాయం, కాలు విరిగిపోవడంతో ప్రాథమిక వైద్య సేవల అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు నిర్వహించనున్నట్లు కురుపాం పోలీసులు తెలిపారు.
బాలుడికి తీవ్ర గాయాలు
కొత్తవలస: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస నుంచి ఎల్.కోట వైపు ఆటో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొత్తవలసకు చెందిన బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో,కారు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్డుసేఫ్టీ పోలీసులు హూటా హుటిన వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
బైక్పైనుంచి కింద పడి మహిళకు గాయాలు
రామభద్రపురం: మండలకేంద్రంలోని టీబీఆర్ సినిమా థియేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేగాల శ్రీనివాసరావు ఆయన భార్య కల్యాణి విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ద్విచక్రవాహనంపై పార్వతీపురం జిల్లాలోని చెక్కవలస వివాహానికి వెళ్తున్నారు. రామభద్రపురంలోని థియేటర్ వద్దకు వచ్చేసరికి కల్యాణికి చెందిన చున్నీ వాహనం వీలుకు చుట్టుకోవడంతో బైక్పై నుంచి ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోగా తలకు గాయమైంది. దీంతో స్థానిక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తరువాత మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
సీతానగరం: మండలంలోని గుచ్చిమి–జోగింపేట గ్రామాల మధ్య రైల్వేట్రాక్ దాటుతున్న గుచ్చిమి గ్రామానికి చెందిన మరిపి అప్పలనాయుడి(33)ని ఆదివారం ఉదయం రైలు ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన రైల్వే హెచ్సీ రత్నకుమార్ మాట్లాడుతూ గుచ్చిమి గ్రామానికి చెందిన వ్యక్తి ఆదివారం ఉదయం తోటకు వెళ్లడానికి ఇంటినుంచి బయల్దేరి మార్గమధ్యంలో ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. ట్రాక్ పక్కనే ఉన్న మృతదేహాన్ని గమనించిన రైల్వేసిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.

కరాటేలో బాలుడి ప్రతిభ

కరాటేలో బాలుడి ప్రతిభ