
నాలుగు వాహనాలు దగ్ధం
కొత్తవలస: మండలంలోని రాజా థియేటర్ సమీపంలో గల వసంత్విహార్ అపార్ట్మెంట్ సముదాయం బ్లాక్–5లో సెల్లార్ కింద గల నాలుగు వాహనాలు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి దగ్ధమయ్యాయి. పి.లక్ష్మణరావు, కె.వెంకటస్వామిలకు చెందిన ద్విచక్రవాహనాలతో పాటు మరొకరికి చెందిన ఒక ద్విక్రవాహనం, మారుతి–800 కారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడంతో అపార్ట్మెంట్ వాసులు దిగి చూసేసరికి వాహనాలు తగలబడిపోతున్నాయి. ఆర్పేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో కొత్తవలస అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే గల విద్యుత్ మీటర్ల బోర్డుకు ఈ మంటలు వ్యాపించి ఉంటే పెనుప్రమాదం జరిగేదని అపార్ట్మెంట్ వాసులు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ వాహనాలకు కావాలనే నిప్పు పెట్టారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆందోళనలో అపార్ట్మెంట్ వాసులు