
ముగిసిన బదిలీ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది బదిలీ ప్రక్రియ గత నెల 29 నుంచి ఆదివారం వరకు ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ నేతృత్వంలో నిర్వహించగా ఆదివారం ఈ ప్రక్రియ ముగిసినట్లు పీఓ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, వివిధ మాధ్యమాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, అలాగే బోధనేతర సిబ్బందికి బదిలీలకు సంబంధించిన పత్రాలను ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ఆయన ఆదివారం అందజేశారు.
జీఓ23 అమలు సరికాదు
బదిలీలపై యూటీఎఫ్ కార్యదర్శి మురళీమోహన్ మాట్లాడుతూ బోధనేతర సిబ్బందికి సంబంధించిన జీఓ నంబర్ 23ను అనుసరించి బదిలీ ప్రక్రియ నిర్వహించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు జీఓ నంబర్ 22 మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల తరఫున ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.