
విక్రంపురంలో గంజాయి కలకలం..!
కొమరాడ: మండలంలోని విక్రంపురం గ్రామ సచివాలయం, జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాల పరిసరాల్లో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు కావడంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ పాఠశాల వద్ద కొందరు యువకులు మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సిరిపురం గౌతమ్ అనే యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిపై గంజాయి మత్తులో దాడి చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులు గౌతమ్ను ప్రశ్నించగా వారిపై ఇటుక రాళ్లతో దాడికి దిగాడు. దీనిపై ఆరా తీయగా ఆ యువకుడు తెల్లవారి నుంచే మద్యంతో పాటు గంజాయి సేవిస్తూ ఇష్టారాజ్యంగా గ్రామంలో తిరుగుతూ ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడం అలవాటైందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ యువకుడితో పాటు గ్రామానికి చెందిన పలువురిని గంజాయికి బానిస చేస్తున్నాడని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ ఆగడాలు గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బాలుడి తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.
తొమ్మిదేళ్ల బాలుడిపై దాడి