
ఏడాది కూటమి పాలనలో... అభివృద్ధి, సంక్షేమం శూన్యం
● జెడ్పీచైర్మన్ మజ్జిశ్రీనివాసరావు ధ్వజం
● రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
నడుస్తోంది
● ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప ప్రజలకు
చేసినదేమీ లేదు
● సూపర్సిక్స్ హామీలను గాలికి
వదిలేశారు
● ఏడాదిలో లక్షా 50 వేల కోట్లు అప్పుచేసినా పథకాలు అందజేయని వైనం
● జూన్ 4న ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహణ
మెరకముడిదాం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్లను మెరకముడిదాంలో స్థానిక నాయకులతో కలిసి శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ తీరుపై నిరసన తెలియజేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ఏడాది కాలంలో లక్షా 50 వేల కోట్లు అప్పు చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పని చేపట్టలేదని, అప్పుచేసిన డబ్బులు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. రైతుల పంటల సాగుకు భరోసా లేదు, చదువుతున్న చిన్నారులకు తల్లికి వందనం లేదు.. మహిళలకు ఉచిత బస్సును సైతం తుస్సుమనిపించారని విమర్శించారు. ఒక్కపథకమూ అమలుచేయలేక, ప్రజలకు మోహాలు చూపించలేక నియోజకవర్గాల్లో కూటమి నేతలు తిరగడం మానేశారన్నారు. ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని, కనీసం సమావేశాలకు కూడా రాకుండా మోహంచాటేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల పిల్లల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని, నాడు–నేడు పనులతో పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందించిందన్నారు.
నేడు పనులు చేసినా బిల్లులు అందడం లేదంటూ కూటమికి చెందిన నాయకులే గగ్గోలు పెడుతున్నారన్నారు. పదోతరగతి ఫలితాల ప్రకటనలో వైఫల్యానికి విద్యాశాఖ మంత్రి లోకేశే కారణమన్నారు. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసిన ఫెయిలైన 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారంటే పరీక్ష పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్.ఆర్.కె.ప్రసాద్, బూర్లె నరేష్కుమార్, పప్పల కృష్ణమూర్తి, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బోనెల గోపి, సత్తారు శ్రీనివాసరావు, టి.వర్మరాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.

ఏడాది కూటమి పాలనలో... అభివృద్ధి, సంక్షేమం శూన్యం