
పదోతరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం విఫలం
● ప్రభుత్వ తొందరపాటు చర్యలతో
వేలమంది జీవితాలపై తీవ్ర ప్రభావం
● రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు
● 66,363 పేపర్ల మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు
● 11వేల పైగా పేపర్లో విద్యార్థుల ఉత్తీర్ణత, మార్కుల మార్పు
● విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
విజయనగరం గంటస్తంభం:
విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, విద్యారంగాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ నాయకులు దుయ్యబట్టారు. అమర్ భవన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్మి ఎన్.నాగభూషణం మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేశారు. ఎన్నడూలేని విధంగా పరీక్షలు పూర్తయిన 22 రోజులకే ఫలితాలు విడుదల చేశామని విద్యాశాఖమంత్రి గొప్పలు చెప్పుకున్నారు. తీరా ఈ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు అసహనం చెందడంతో పాటు మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రచారం ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ ఫలితాల విడుదలలో చూపలేదు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేస్తే.. ఫెయిలైన 11,000 మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. చాలా మందికి సబ్జెక్టు మార్కుల శాతం భారీగా పెరిగాయి. ప్రభుత్వం తప్పుడు ఫలితాలు ఇవ్వడం వల్ల చాలామంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చందని వాపోయారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు నోరుమెదపకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్మి పి.గౌరీ శంకర్, పట్టణ కార్యదర్మి ఏ.సమన్, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.