
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
విజయనగరం అర్బన్: దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ రకాల ఉపకరణాలను శనివారం పంపిణీ చేశారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో సాగుతున్న సహిత విద్యలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. హియరింగ్ ఎయిడ్స్–35, వీల్చైర్లు 13, టీఎల్ఎం ప్రైమరీ కిట్లు 11, సెకండరీ కిట్లు 10, క్రచ్ ఎల్బోలు 2, త్రీవీలర్ సైకిల్స్ 2, రోల్లేటర్ అడల్ట్ 3, చైల్డ్ 2, ఫోల్డింగ్ వీల్చైర్లు 8, బ్యాటరీ ట్రైసైకిల్స్ 2, విభిన్న ప్రతిభావంతుల వీల్చైర్ 1 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. డీఎస్సీలో భర్తీ చేయనున్న 2,200 స్పెషల్ టీచర్ పోస్టులతో ప్రత్యేకావసరాల పిల్లలకు విద్యాబోధన మరింత చేరువవుతుందని చెప్పారు. డీఆర్వో మురళి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు. సహిత విద్య అన్నది విశిష్ట పథకమని పేర్కొన్నారు. డీఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ రామారావు మాట్లాడుతూ, తమ శాఖాపరమైన కార్యక్రమాలు, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. స్పెషల్ ఒలింపిక్స్లో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఎంపికై న అడ్డ తోషిని, కె.సంతు, ఈనుమల యశ్వంత్, రాజాన అజయ్, కొప్పర విజయ్కుమార్తో పాటు కోచ్లు పి.సునీల్, బంగారునాయుడును మంత్రి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.