
బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు
పార్వతీపురం: బాలల హక్కులకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకదుర్గ అన్నారు. పట్టణంలో సౌందర్య థియేటర్ రోడ్డులో బాల్య వివాహాలను నిర్మూలించడానికి, బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలకు మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రచార రఽథాన్ని శనివారం ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ కోసం ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందన్నారు. బాలల హక్కుల రక్షణ మిషన్( ఎన్సీపీసీఆర్), రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్(ఎస్సీపీసీఆర్) గూర్చి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార రథం బాలల హక్కుల రక్షణ కోసం ఒక అవసరమైన సాధనంగా పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీపీవో అల్లు సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు.