
పొగాకు జోలికి పోకు..!
● ప్రాణాలు తీస్తున్న ధూమపానం
● నోటి, ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ఆస్కారం
● పొగతాగేవారితో పాటు పక్కన పీల్చేవారికి ముప్పు
● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం
మత్తెక్కించే వగలమారి వయ్యారి
నువ్వు తోడైతే జీవితం ఎడారి
మండుతూ ఆరోగ్యానికి ఎసరు పెడతావు
పొగగా మారుతూ ఊపిరి తీస్తావు
బూడిదవుతూ జీవితాలను బూడిద చేస్తావు
వినోదం అని నీతో జత కడతారు పిచ్చి జనం
వ్యసనంగా మారిపోవును నీతో సహవాసం
విషాదంతో బజారు పాలవును కుటుంబం
వదులుదాం..కదులుదాం.. ఆరోగ్యాన్ని
కాపాడుకుందాం
విజయనగరం ఫోర్ట్: పొగాకు ఉత్పత్తులు తినడం, పొగాకు తాగడం కారణంగా జిల్లాలో గుండెపోటు, కేన్సర్, వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు గురైన ప్రతి ముగ్గురిలో ఒకరు ధూమపానం కారణంగానే ప్రమాదకర పరిస్థితి బారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మధుమేహ వ్యాధి అదుపులో లేకపోవడంతో ఆ ప్రభావం కిడ్నీలు, లివర్, కళ్లు వంటి కీలకమైన అవయవాలపై పడుతుంది. సిగరెట్, చుట్ట తాగడం ఫ్యాషన్గా మారిపోతోంది. ఒకరిని చూసి మరొకరు సిగరెట్, చుట్టలు తాగడం అలవాటుగా మార్చుకుంటున్నారు. రోజురోజుకూ పొగతాగే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో పొగతాగే వారి సంఖ్య 30 శాతం వరకు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఒక సిగరెట్ నిమిషం జీవితకాలాన్ని తగ్గించేస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకూడదన్న నిబఽంధన బుట్టదాఖలవుతోంది. సిగరెట్ తాగిన వారితో పాటు పక్కనున్న వారు ఆ పొగను పీల్చినా వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గతంలో నిరాక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతవాసులు ఎక్కువగా సిగరెట్, చుట్టలు తాగేవారు. కానీ నేడు పల్లె , పట్టణం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పొగతాగుతున్నారు. యువత సిగరెట్ తాగడానికి అలవాటు పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం. పొగ తాగడం వల్ల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయని తెలిసినప్పటికీ అలవాటు అయిన వారిలో మార్పు రావడం లేదు. పొగతాగుతున్న వారిలో 8 శాతం మంది యువత ఉండడం గమనార్హం. పొగతాగుతూ స్వయంగా అనారోగ్యం బారినపడడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అనారోగ్యం పాలుచేస్తున్నారు. జిల్లాలో పొగతాగుతున్న వారిలో పురుషులు 20శాతం మంది కాగా మహిళలు 10 శాతం మంది ఉన్నారు. యవత 8శాతం మంది ఉన్నారు.
పొగతాగడం వల్ల ప్రాణాంతక వ్యాధులు
సిగరెట్, చుట్ట తాగడం, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల్ల ప్రాణంతకమైన కేన్సర్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల గొంతు, ఊపిరితిత్తుల కేన్సర్, నోటి కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆస్తమా, సీఓపీడీ వచ్చే ఆస్కారం ఉంది. వాటితో పాటు క్రానిక్ బ్రాంక్లైటిస్ వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. పొగతాగడం వల్ల నిమోనియా వ్యాధి అధికమవుతుంది. ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి అధికమవుతుంది. పొగాకును కొంతమంది ముక్కువద్ద పీల్చుతుంటారు. మరి కొంతమంది నోటి ద్వారా పీల్చుతుంటారు. పొగ ఎక్కువగా పీల్చడం వల్ల దాని ప్రభావం రక్తనాళాలు, నాడీ వ్యవస్థపై పడుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. నిద్రలేమి సమస్య వస్తుంది. దీని వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన రోగులు పడుతున్నారు. పొగ తాగేసి మానివేసినప్పటికీ వయసు పెరిగే కొద్దీ దాని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుంది.
సిగరెట్ తాగుతున్న వ్యక్తి
స్మోకింగ్ వల్ల జీవిత కాలం తగ్గుతుంది
సిగరెట్లు, చుట్టలు తాగడం వల్లజీవితకాలం తగ్గిపోతుంది. సాధారణంగా 70 ఏళ్లు జీవించేవారు 60 నుంచి 65 ఏళ్లకే మరణిస్తారు. అతితక్కువ వయస్సులో (30 నుంచి 35) ఏళ్లకే మొదడు పోటుకు గురయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు ఉబ్బి ఆస్తమా వంటి వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల కేన్సర్, గొంతు అన్నవాహిక కేన్సర్, మూత్రాశ్రయం, లివర్, వ్యాధులు సోకే అవకాశం ఉంది. పొగతాగడం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు మందులు వాడినా పనిచేయని పరిస్థితి. పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు మానివేయడం కోసం చూయింగ్ గమ్స్, నికోటిన్ పేచర్స్ వాడుకోవాలి.
డాక్టర్ బొత్స సంతోష్కుమార్
పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
ఏడాదికి రూ.1.20 కోట్ల వ్యాపారం
అన్ని రకాల వర్గాల వారికి సిగరెట్లు, చుట్టలు అంటుబాటులో ఉన్నాయి. ఏడాదికి రూ.1.20 కోట్ల వరకు సిగరెట్లు, చుట్టల కోసం ఖర్చు చేస్తున్నారు. సామన్య ప్రజలు చుట్టలు, తక్కువ రకం సిగరెట్లు తాగుతున్నారు. సంపన్నవర్గాలు వారు ఖరీదైన సిగరెట్లు తాగుతున్నారు .
2024 –25లో కేన్సర్ బారిన 299మంది
2024–25 లో జిల్లాలో 299 మంది నోటి, గొంతు కేన్సర్ బారిన పడ్డారు. ఊపిరితిత్తుల కేన్సర్ , ఆస్తమా, సీఓపీడీ వ్యాధుల బారిన జిల్లాలో 5 వేల నుంచి 6 వేల మంది పడుతున్నారు. కేన్సర్ ముదిరినంత వరకు గుర్తించలేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నారు. కేన్సర్ను ప్రారంభదశలో గుర్తిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. కానీ ముదిరితే మరణమే శరణ్యం.

పొగాకు జోలికి పోకు..!

పొగాకు జోలికి పోకు..!

పొగాకు జోలికి పోకు..!

పొగాకు జోలికి పోకు..!