విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, వేదపండితులు సాయికిరణ్, అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్లు శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి హుండీల ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్యర్యంలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడి, వనంగుడి ఆలయాల్లో మార్చి 28వతేదీన హుండీలను ఏర్పాటుచేశారు. అప్పటినుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీలలో సమర్పించుకున్న కానుకలు లెక్కించగా, రూ.3,99,618 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో సాలూరు గ్రూపు దేవాలయాల కార్యనిర్వాహణ అధికారి టి.రమేష్, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ తీళ్ల పోలినాయుడు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
జూన్ 2న కలెక్టరేట్ ఆవరణలో ధర్నా
పార్వతీపురం: జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ డీఈఓను నియమించాలని కోరుతూ జూన్ 2న కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహిస్తున్నట్లు గిరిజన సంక్షేమ సంఘ ప్రధానకార్యదర్శి పాలక రంజిత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత వరుసగా మూడుసార్లు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో ప్రధమ స్థానం సాధించిన జిల్లాకు పూర్తి స్థాయి డీఈఓను నియమించకపోవడం బాధాకరమన్నారు. డీఈఓ నియమాకంలో జిల్లా ఉన్నతాధికారులు తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పూర్తిస్థాయి డీఈఓను నియమించేంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి తూ గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జియ్యమ్మవలస మండలంలోని పరజపాడు గ్రామంలో జరిగింది. దీనిపై చినమేరంగి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన శంబంగి గోపి నాయుడు(51) కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధడుతున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 10గంటల సమయంలో భార్య ఉపాధి పనులకు వెళ్లిన అనంతరం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో స్థానికులు 108 సహాయంతో చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలపగా చినమేరంగి ఎస్సై పి.అనీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశాఉ. తెలిపారు. మృతి చెందిన గోపినాయుడికి భార్య అన్నపూర్ణమ్మ, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు శిరీష, సౌజన్యలు ఉన్నారు.

పైడితల్లి అమ్మవారికి స్వర్ణపుష్పార్చన