
ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి
పార్వతీపురం రూరల్: మూస పద్ధతికి స్వస్తి పలికి నూతన విధానాలను అవలంబించి క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసి సమర్ధవంతంగా శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీటవేయాలని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పురోగతి ఎస్సీ,ఎస్టీ కేసులు, ప్రయారిటీ పీటీ కేసుల స్థితిగతులు అక్రమ మద్యం, మిస్సింగ్, సైబర్ నేరాలు, నాన్బెయిల్బుల్ వారెంట్లు తదితర కేసులకు సంబంధించిన విషయాలపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఎస్పీ వాటికి తగిన సూచనలు, సలహాలు, మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి
అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు పాచిపెంట, కొమరాడ, గుమ్మలక్ష్మీపురంలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఉంచాలని ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉన్నారో? లేదో? అని ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టి సమాచారం సేకరణ క్షుణ్ణంగా చేసి అక్రమ రవాణాపై దృష్టిసారించాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు.
ప్రశంసాపత్రాల అందజేత
విధి నిర్వహణలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలను అందజేశారు. అలాగే వార్షిక ఫైరింగ్ శిక్షణలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన అధికారులు, సిబ్బందికి కూడా ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. సమావేశంలో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్బీ సీఐ రంగనాథం, డీసీఆర్బీ సీఐ ఆదాం, సోషల్ మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఏఆర్ ఆర్ఐ రాంబాబు, సీఐలు, ఎస్లు, ఎకై ్సజ్ అధికారులు, మెడికల్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి