
బినామీ మస్తర్లు వేసుకున్న వారికి రికవరీ నోటీసులు
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామంలో ఉపాధిపనుల్లో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడిన విషయాన్ని సాక్ష్యాలతో సహా సాక్షి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష అభియాన్ లో ఔట్సోర్సింగ్ పద్దతిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సారాది సత్య నారాయణ బినామీ మస్తరు వేసుకోవడంతో అతనికి రూ. 1260 పేమెంట్ జనరేట్ అయింది. అదేవిధంగా సుంకరి సత్యనారాయణ అనే వ్యక్తి విశాఖపట్నం జిల్లా పధ్మనాభం మండలం అనంతవరంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు కూడా పనికి వెళ్లక పోయినా పనికి వెళ్లినట్టు బినామీ మస్తర్ వేయడంతో రూ.3276 పేమెంట్ జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమంది గ్రామంలో బినామీ మస్తర్లు వేసుకుని అక్రమాలకు పాల్పడి వేలాది రుపాయిలు కొల్లగొట్టారనే విషయాన్ని సాక్షి బయట పెట్టింది. దీంతో ఉపాధి హామీ అధికారులు, ఎంపీడీఓ ఈ అంశంపై విచారణ చేపట్టారు. వారి విచారణలో బినామీ మస్తర్లు వేసుకోవడం నిజమని తేలింది. దీంతో బినామీ మస్తర్లు వేసుకున్న ఇద్దరికి రికవరీ నోటీసులు ఇస్తున్నట్లు ఎంపీడీఓ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. అదేవిధంగా వారిద్దరికి బినామీ మస్తర్లు వేసిన మేట్లు మంగ, లక్ష్మీకాంతానికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు.
మేట్లకు షోకాజ్

బినామీ మస్తర్లు వేసుకున్న వారికి రికవరీ నోటీసులు