
సబ్జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జి
శృంగవరపుకోట: పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి డా.ఎ.కృష్ణప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ కేసుల సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకుంటే మండల న్యాయసేవా కమిటీ ద్వారా సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఖైదీలకు అందిస్తున్న సదుపాఽయాలపై ఆరా తీశారు. జైలు ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశీలించారు. న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా బయట ఉన్న పేదలు కూడా ఉచిత న్యాయసాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. జూలై 5న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నామని, కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాద సిబ్బంది పాల్గొన్నారు.