
జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. జూన్ 2 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా బాలకార్మికుల పునరావాసం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లా స్థాయి. డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సభ్యులు జిల్లా అంతటా ఒకే సమయంలో దాడులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు ప్రమాదకరమైన సంస్థలు, స్థలాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను రెండు రోజుల్లోగా గుర్తించాలని సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే పనిచేయించే యాజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. నెలరోజుల పాటు జిల్లా అంతటా టాస్క్ ఫోర్స్ కమిటీలు ఒకే సమయంలో దాడులు జరపాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మురళి, డిప్యూటీ కమిషపర్ ఆఫ్ లేబర్ ప్రసాదరావు, ఐసీడీఎస్ పీడీ రుక్సానా బేగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ హిమబిందు, డీసీపీయూ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్