
నచ్చినంత తవ్వుకో.. వచ్చినంత అమ్ముకో...
బొబ్బిలి రూరల్: బొబ్బిలి మండలంలో గ్రావెల్ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చెరువులు, గట్లు రూపుకోల్పోతున్నాయి. ‘నచ్చినంత తవ్వకో.. వచ్చినంత అమ్ముకో’ అన్న రీతిన తవ్వకాలు జరుగుతున్నాయి. ‘అధికార’ బలంతో రంగరాయపురం, గ్రోత్సెంటర్, మల్లంపేట, దిబ్బగుడ్డివలస గ్రామాల్లోని చెరువులు, ప్రభుత్వ భూముల్లో రాత్రీపగలు తేడా లేకుండా కంకర తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ట్రాక్టర్ గ్రావెల్ రూ.1500, టిప్పర్ రూ.3వేల చొప్పున రియల్ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీని వెనుక అధికారపార్టీ పెద్దల హస్తం ఉన్నట్టు సమాచారం. తవ్వకాల్లో వారికీ వాటా వెళ్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర తవ్వకాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.