
ఉద్యోగులకు యోగాంధ్ర పాట్లు..!
విజయనగరం అర్బన్/సాక్షి, పార్వతీపురం మన్యం:
అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. జూన్ 21వ తేదీ నాటికి అందరికీ యోగాపై సంపూర్ణ అవగాహన ఉండాలంటూ.. నెల రోజుల కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రతి రోజూ గ్రామ, పట్టణ స్థాయిల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వామ్యం చేయాలని సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలో కార్పొరేషన్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు.. సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై యోగా చేయిస్తున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు. మొత్తంగా జిల్లా అధికార యంత్రాంగం దాదాపు కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉంటోంది. జూన్ 21వ తేదీ వరకు ఉంటుంది కూడా. మరి.. ఇవన్నీ చేయాలంటే మనుషులు ఉండాలి. అందుకోసం అందుబాటులో ఉన్న ఏ ఒక్కరినీ వదలడం లేదు. అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వైద్య సిబ్బంది.. ఇలా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్నారు. వీటిని పక్కాగా అమలు చేసేందుకు గ్రామ, మండల స్థాయి కమిటీలను నియమించారు. యోగాంధ్ర మినహా.. కొద్దిరోజులుగా మిగతా విషయాలను పక్కన పెట్టేసింది.
లెక్కల కోసం తిప్పలు..
యోగా మాసంలో భాగంగా వివిధ స్థాయిల్లో పోటీ లు నిర్వహించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెబుతున్నారు. దీంతో లెక్కలు చూపించేందుకు జిల్లా అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయాలని సచివాలయ సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఇందుకోసం యోగా మంత్ యాప్ను సిద్ధం చేశారు. స్వచ్ఛందంగా ప్రజలెవరూ నమోదుకు ముందుకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందే.. తమకు తెలిసిన వారి నంబర్లు సేకరించి, వారికి ఓటీపీలు ఇవ్వండంటూ బతిమలాడుతూ, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు ఓటీపీలు అడుగుతున్నారో కూడా చాలామందికి తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. వారి కుటుంబ సభ్యులతోనూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. విజయ నగరం జిల్లాలోని 27 మండలాల పరిధిలో 7.8 లక్షల మందిని యోగాంధ్రలో భాగస్వాములు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతిరోజు కనీసం 40వేల నుంచి 50 వేల మందిని నమోదుచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటివరకు 85వేల మంది మాత్రమే యోగాంధ్ర పోర్టల్లో తమ పేర్లును నమోదుచేసుకున్నారు. దీంతో పాటు 5,270 మంది శిక్షకులుగా పేర్లు నమోదుచేసుకున్నారు. వీరికి 31వ తేదీ వరకు ఆయా మండలాల్లో శిక్షణ ఇస్తారు. ఈ నెల 30న రామనారాయణంలో 1000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఏదో కార్యక్రమం చేపట్టేవారని.. ఇలా నెల రోజులు నిర్వహించి, పెద్ద ఎత్తున నిధులు, సమయం వృథా చేయడం ఎన్నడూ లేదని ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారులు సైతం మరో దారి లేక ఫొటోల కోసం ‘మమ’ అనిపించేస్తున్నారు.
యోగా మాసోత్సవంలో జన సమీకరణకు ఆపసోపాలు
వేలల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటూ ఒత్తిళ్లు
బలవంతంగా పేర్ల నమోదు..
సచివాలయ సిబ్బందికి టార్గెట్లు

ఉద్యోగులకు యోగాంధ్ర పాట్లు..!