
బెట్టింగ్ మాయలో పడి..!
పోలీసులేమంటున్నారంటే..
ఇదే విషయాన్ని ఎస్సై జి.కళాధర్ వద్ద సాక్షి ప్రస్తావించగా క్రికెట్ బెట్టింగ్లపై నిఘా వేసి బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. యువత ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడికపై దృష్టి సారించి వారిని మంచి మార్గంలో నడిపించేలా చొరవ చూపాలి.
● తప్పుదారి పడుతున్న యువత
● బెట్టింగ్ మనీ కోసం అప్పులు,
దొంగతనాలు
● ఆర్థికంగా దివాలా తీస్తున్న కుటుంబాలు
వీరఘట్టం: ఈ సీజన్ ఐపీఎల్ బెట్టింగ్లో ఘోరంగా డబ్బులు పోగొట్టుకున్న వీరఘట్టానికి చెందిన ఓ కుర్రాడు తాను పనిచేస్తున్న ఇంట్లో సుమారు 5 తులాల బంగారు నగలు దొంగిలించాడు. అలాగే ఇంకొందరు యువకులు అధిక వడ్డీలకు అప్పులు కూడా చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు ఎన్నో కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. బెట్టింగ్ ఉచ్చులో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకా మేల్కోకపోతే యువత భవిత సర్వనాశనం అవడం ఖాయమని మేధావులు అంటున్నారు. ప్రతి ఏటా జూద క్రీడలకు అలవాటుపడిన కొందరు అలవాటు మానుకోలేక సీజనల్ జూదానికి తెరలేపుతుపున్నారు. ఏడాదిలో 20 శాతం పేకాట, మిగిలిన 80 శాతం క్రికెట్ బెట్టింగ్లతో కాలం వెళ్లబుచ్చుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యువతను బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నారు. తాజాగా రెండు నెలల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ క్రికెట్ పోటీలను తిలకిస్తూ బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ మ్యాచ్ల కోసం పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అంతా ఆన్లైన్లోనే..
ప్రస్తుతం క్రికెట్ బెట్టింగ్ అంతా ఆన్లైన్లోనే దర్జాగా జరుగుతోంది. మీడియేటర్ల ద్వారా పందాలు కాస్తున్నారు. ప్రతి రోజూ వీరఘట్టంలో రూ.50 లక్షల వరకూ బెట్టింగ్లు విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టంలోని అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. లక్నో టీమ్ నాదంటే, రాజస్థాన్ రాయల్స్ నాది అంటూ వెయ్యి రూపాయలకు రూ.16 వందలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు పేట్రేగి పోతున్నారు.చిన్నచిన్న కిరాణాషాపులు, పకోడీబడ్డీలు, పాన్షాపుల వద్ద ఈ తతంగం అంతా జరుగుతోంది. టెస్ట్మ్యాచ్లు, టీ20, వన్డే మ్యాచ్లు అని తేడా లేకుండా క్రికెట్ ఏ తరహాదైనా బెట్టింగ్ మాత్రం అదే తరహాలో కాస్తున్నారు. ఈ బెట్టింగ్లకు అలవాటుపడిన యువత పక్కదోవ బడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి కుదేలవుతున్నారు. మరికొంతమంది ఆర్థిక నేరాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మాయదారి క్రికెట్ బెట్టింగ్లు వీరఘట్టంలో గడిచిన పదిహేనేళ్ల నుంచి యథేచ్ఛగా జరుగుతున్నా ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.