
ఖరీఫ్ సీజన్ త్వరగా మొదలు పెట్టాలి
విజయనగరం ఫోర్ట్: ప్రకృతి అనుకూలత వల్ల ఈఏడాది ముందుగానే వర్షాలు మొదలయ్యాయని వీలైనంత వేగంగా విత్తనాలు జల్లి ఖరీఫ్ సీజన్ మొదలుపెట్టాలని కలెక్ట్ బీఆర్ అంబేడ్కర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వ్యవసాయ అధికారులు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆక్టోబర్ లోగా కోతలు పూర్తి చేసేవిధంగా వీలైనంత త్వరగా విత్తనాలు జల్లాలని సూచించారు. దీనివల్ల నవంబర్లో వచ్చే తుఫాన్ల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అభిప్రాయ పడ్డారు. తద్వారా రబీసీజన్ కూడా వీలైనంత త్వరగా మొదలు పెట్టే అవకాశం కలుగుతుందన్నారు.
కౌలు రైతులకు రుణాలు
జిల్లాలో ఈఏడాది సుమారు 16,500 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీచేసి, వారికి రూ.150 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలోగా ఈ గుర్తింపు కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కోసం సుమారు 4,89,116 మంది రైతుల వివరాలను తనిఖీ చేసి అర్హుల జాబితా ఎంపిక పక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారుల లాగిన్లో పెండింగ్లో ఉన్న రోజుల్లోనే తనిఖీ పూర్తి చేసి అమోదం తెలపాలని స్పష్టం చేశారు. రైతుల అధార్ కార్డుల సవరణ, మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టాలని సూచించారు. పీజీఆర్ఎస్లో రెవెన్యూకు సంబంధించి 1017 ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ ఎక్కువగా ఉన్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, ఎల్డీఎం నారాయణమూర్తి, ఏపీ సీడ్స్ డీఎం పద్మ, మార్క్ఫెడ్ డీఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్