
అనర్హులకు కేటాయించిన ఇళ్ల రద్దు
విజయనగరం అర్బన్: పేదలకు గృహనిర్మాణం కోసం ప్రభుత్వం అదనపు నగదు మంజూరు చేసిందని అయినప్పటికీ గృహ నిర్మాణాల కోసం ముందుకురాని లబ్ధిదారుల స్టేటస్ను వెరిఫై చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ ఆదేశించారు. లబ్ధిదారులకు సొంత గృహం ఉండడం వల్లనే గృహ నిర్మాణాలకు ముందుకు రావడం లేదని తెలుస్తోందని అటువంటి వారి జాబితాలను ఇంటింటికీ వెళ్ల వెరిఫై చేసి ఆధారాలతో సహా రెండు రోజుల్లో ఇవ్వాలని వారికి మంజూరైన గృహాలను రద్దు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అవాజ్ యోజన కింద మంజూరైన 11 వేల గృహాలను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. 11 వేల ఇళ్లకు గాను ఇప్పటి వరకు 41 శాతం మాత్రమే పూర్తయ్యాయని ఇంకనూ 6,924 గృహాలు పూర్తి కావలసి ఉందన్నారు. బొబ్బిలి, విజయనగరం అర్బన్లో తక్కువ గృహాలు పూర్తి కావడంపై వివరణ అడిగారు. నీటి సరఫరా లేదని, వేసిన బోర్లు దొంగతనానికి గురయ్యాయని మున్సిపల్ కమిషనర్లకు లేఖ రాశామని పీడీ మురళి తెలిపారు. రెండు రోజుల్లో బోర్లన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం గతంలో ఇచ్చిన 4,096 దరఖాస్తులను వెరిఫై చేయాలని అలాగే మాన్యువల్గా వచ్చిన మరో 2,500 దరఖాస్తులను కొందరు తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని అర్హతను వెరిఫై చేయాలని స్పష్టం చేశారు. అందరికీ గృహాలు, పీఎంజన్మన్పథకాల కింద మంజూరైన జాబితాలను కూడా వెరిఫై చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
11 వేల గృహప్రవేశాలకు సిద్ధం చేయండి
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్