
విశాఖ స్టీల్ప్లాంట్ సమస్య పరిష్కరించాలి
విజయనగరం గంటస్తంభం: పత్రిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం తక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజయనగరం జిల్లా నాయకులు టీవీ రమణ, కె.అప్పలసూరి, బి.రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందని, ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంఽధ్రకు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ స్టీల్ ప్లాంట్ను కేంద్రం అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, సెయిల్లో విలీనం చేయాలని, మరింత సమర్థవంతంగా నడపాలని పోరాడుతుంటే, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, నిర్బంధం ప్రయోగించి, ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం ద్వారా విశాఖ ఉక్కు పరిరక్షణ కట్టుబడి ఉంటామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ స్పందించి స్టీల్ప్లాంట్ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రెడ్డి శంకర్రావు, ఎం.వాసు, వి.లక్ష్మి, సూర్యనారాయణ, జగన్మోహన్ రావు, ఆనంద్, పెంటరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్