
మెరుపు చూసి మసలుకో..!
● పిడుగులు, వడగళ్లతో జాగ్రత్త అవసరం
● ఏటా పదుల సంఖ్యలో మరణాలు
● అనేక కుటుంబాల్లో విషాదం
● అప్రమత్తతతోనే ప్రమాదాలకు దూరం
పిడుగులకు సంకేతం ఈ మెరుపులు
విజయనగరం గంటస్తంభం:
వాతావరణంలో మార్పులతో మేఘం కమ్ముకుంటే చాలు.. భయపడే రోజులు వచ్చాయి. మెరుపులు, ఉరుములతో పాటు పిడుగుల వాన కురుస్తోంది. పొలాలకు వెళ్లే రైతులతో పాటు మేతకోసం వెళ్లే జీవాలు ఎక్కువగా పిడుగుపాటుకు గురవుతున్నాయి. విషాదాన్ని మిగుల్చుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకుంటే పిడుగుపాటు నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందే అంచనా వేయడంతో పాటు, ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని సలహా ఇస్తున్నారు.
● ఏప్రిల్– జూన్ మధ్యనే అధికం..
ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ఆ సమయంలో సముద్రంలో నుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే దట్టమైన క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకుంటాయి. అప్పుడే ఉరుములు ప్రారంభమవుతాయి. పిడుగులు పడుతుంటాయి. గడిచిన కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గరు రైతులు మృతి చెందారు.
● పిడుగులు ఏర్పడడం ఇలా...
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి. అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం, రుణవేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి. ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి. ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగు పడటం’ అంటారు. అలా మేఘాల నుంచి పడే ‘పిడుగు’లో దాదాపు 30 కోట్లు ఓల్టుల విద్యుత్ ఉంటుంది.
● ముందస్తు సమాచారం ఇచ్చేలా..
పిడుగు పాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది. దీనికోసం ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించవచ్చు.
● పిడుగుపాటు సంకేతాలివే...
ఆకాశంలో నల్లని మబ్బులు పట్టడం, మెరుపులు కనిపించడం, ఉరుములు వినిపించడం, వేగంగా గాలులు వీయడం పిడుగుపాటుకు సంకేతాలుగా భావించాలి.
జాగ్రత్త పడాలి
వర్షాకాలంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలి. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండరాదు. చేతిలో సిల్వర్ పాత్రలు ఉంచరాదు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. పొలానికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభమైతే వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. చెట్ల సంరక్షణతో వేడిని తగ్గించగలిగితే పిడుగుల ప్రభావం నుంచి బయటపడవచ్చు.
– ఆర్.కొండలరావు,
జిల్లా అటవీ శాఖ అధికారి
అప్రమత్తతే ప్రాణాలకు రక్ష...
పత్రికలు, టీవీల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు స్థానిక అధికారులు చేసే హెచ్చరికలు పాటించాలి.
పిడుగులు ఎత్తైన భవనాలు, స్తంభాలు, వృక్షాలపై పడే అవకాశం ఎక్కువ. ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
ఉరుముల సమయంలో తప్పించుకునేందుకు స్థలం లేకపోతే కిందకు వంగి ఉండాలి.
కూర్చొన్నప్పుడు పాదాల ముందు భాగం మాత్రం నేలను తాకాలి. మిగిలిన ఏ భాగం నేలను తాకకుండా జాగ్రత్త పడాలి.
ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. మేఘాల్లోని విద్యుత్ తరంగాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుడుకు గురుయ్యే ప్రమాదం ఉంది. గృహాల్లో టీవీలు, ఫ్రీజ్లు, ఇన్వర్టర్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికాలకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలి.
ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు..
ఈనెల 12న మెంటాడ మండలం కుంటినివలస గ్రామానికి చెందిన కొల్లి రాంబాబు(45) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పులిగుమ్మి సమీపంలో మట్టి తవ్వుతున్న రామారావు సమీపంలో పిడుగు పడడంతో ప్రమాదం సంభవించింది. అతనితో పాటు ఉన్న కొల్లి సింహాచలం, లోకార్పు మురళి గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
ఈనెల 14న విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలోని పెద్ద బూరడపేట సమీపంలో పిడుగులు బీభత్సం సృష్టంచాయి. పిడుగుపాటుకు గ్రామానికి చెందిన డొప్ప త్రినాఽథ్ అనే రైతుకు చెందిన ఎనిమిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఏప్రిల్ 30న ఎస్.కోట మండలం గిరశిఖర పంచాయతీ పరిధిలోని దారపర్తి గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి కిరణ్ పిడుగుపాటుకు మృతి చెందగా.. అతని సోదరుడు అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. వర్షానికి తడవకుండా చెట్టుకింద ఉన్న ఆవులను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో పిడుగు పడడంతో ప్రమాదం సంభవించింది.
ఈనెల 15న పొలాన్ని దుక్కిచేయించేందుకు వెళ్లిన పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం దేవనాపురం పంచాయతీ జగత్పల్లి బూర్జిగూడ చెందిన సవర చంద్రరావు(28) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.

మెరుపు చూసి మసలుకో..!

మెరుపు చూసి మసలుకో..!