
ప్రాధాన్యతా క్రమంలో జలవనరుల అభివృద్ధి
విజయనగరం అర్బన్/గుర్ల: జిల్లాలోని జలవనరుల అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూక్ష్మ, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రాజక్టుల అభివృద్ధి, ప్రతిపాదనల పనుల వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తోటపల్లి ఎడమ కాలువ నిర్మాణ పనుల ప్రతిపాదనలపై సమీక్షించిన సమయంలో ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 49 అభివృద్ధి పనులను ప్రతిపాదించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా మీకు మీరే ప్రతిపాదనలు తయారు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు పరిశీలించామని, ప్రాజెక్టు పనులు 90 శాతం, కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తిచేసేందుకు రూ.807 కోట్లు అవసరమవుతాయన్నారు. పనులు పూర్తయితే విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం ఎయిర్ పోర్టుకు నీటి సరఫరాకు అవకాశం ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి నదీ జలాలతో ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ జూన్ నాటికి పూర్తిచేసి గోదావరి నుంచి వంశధార వరకు అనుసంధానం చేసి ఉత్తరాంధ్రకు సాగునీరందిస్తామన్నారు. దీనికోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6,500 కోట్లను కేటాయించినట్టు స్పష్టంచేశారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పార్వతీపురం డివిజన్లో 8 పనులు, రాజాం, చీపరుపల్లిలో 4 పనుల తీరును అధికారులను అడిగి మంత్రి తెలుసుకు న్నారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జేసీ సేతుమాధవన్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు కోండ్రు మురళి, లోకంనాగమాధవి, పి.అధితిగజపతిరాజు, మార్క్ఫెడ్ చైర్మన్ బంగార్రాజు, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు, నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజినీర్ డి.రాంగోపాల్, విజయనగరం బొబ్బిలి ఎస్ఈలు స్వర్ణకుమార్, అప్పారావు, వివిధ ప్రాజెక్టుల ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.