
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...
క్రైమ్ కార్నర్
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదనాపురం గ్రామానికి చెందిన వర్రి రామారావు (45) ఆదివారం ఉదయం మదనాపురం జంక్షన్ నుంచి ట్రాక్టర్పై గ్రామంలోకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపైనున్న గొయ్యిని తప్పించేక్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే రామారావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలున్నారు. పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లారీ ఢీ కొట్టడంతో ఒకరు..
సాలూరు రూరల్: మండలంలోని జీగిరాం గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సాలూరు మండలం మంచాడవలసకు చెందిన తంబరి బంగారయ్య, తూలిగి బంగారయ్యలు సాలూరు నుంచి మంచాడవలసకు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా జీగిరాం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తంబరి బంగారయ్య మృతి చెందాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
తెట్టంగిలో చోరీ..
గుర్ల: మండలంలోని తెట్టంగిలో జమ్ము పైడినాయుడు ఇంటిలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ప్రవేశించి ఐదు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. నారాయణరావు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...