
‘సాక్షి’ విలేకరి హఠాన్మరణం
గాజువాక: ‘సాక్షి’ అక్కిరెడ్డిపాలెం విలేకరి బి.రామకృష్ణ హఠాన్మరణం చెందారు. దీంతో ‘సాక్షి’ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం విధులను ముగించుకుని కంచరపాలెంలోని తన సోదరి ఇంటికి వెళ్లిన రామకృష్ణ గుండెపోటుకు గురయ్యారని సమీప బంధువులు తెలిపారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ‘సాక్షి’ దినపత్రికలో అక్కిరెడ్డిపాలెం విలేకరిగా రామకృష్ణ పదేళ్లుగా పని చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజా సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే కథనాలను అందించారు. ఆయన మృతికి ‘సాక్షి’సిబ్బంది, సహచర విలేకరులు సంతాపం ప్రకటించారు. జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు రిపోర్టర్ రామకృష్ణ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.