
అత్యున్నత స్థాయిలో యోగా డే
● అధికారులు బాధ్యతతో పనిచేయాలి ● సమీక్షా సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ఈ నెల 21న జరగనున్న యోగా దినోత్సవాన్ని అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నందున ఈ యోగా దినోత్సవం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందని, జిల్లాలో దీన్ని అత్యున్నత స్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొననుండగా, ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి బీచ్ వరకు, అలాగే వివిధ స్టేడియంలలో యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ఏర్పాట్లలో తమ అనుభవాన్ని ప్రతిబింబించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం జరిగే మొత్తం ప్రాంతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అధికారులకు వివరించారు. ప్రజలను బస్సుల ద్వారా కంపార్ట్మెంట్ ప్రాంతాలకు చేర్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను పార్కింగ్ ప్రదేశాలకు తరలించాలని అదేవిధంగా కార్యక్రమం తర్వాత ప్రజలను వారివారి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రజలకు, ముఖ్య అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యుత్ పార్కింగ్, రవాణా, వైద్యం తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ యోగా కార్యక్రమంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల నుంచి ప్రజలు భారీగా హాజరుకానుండటంతో, ఆర్టీసీ అధికారులు మంచి స్థితిలో ఉన్న బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అన్ని రకాల ఔషధ సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రధాన కార్యక్రమం అనంతరం, అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులతో సూర్య నమస్కారాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్, ఏపీఈపీడీసీఎల్ పృధ్వీరాజ్, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.