నేడు పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పాలిసెట్‌

Apr 30 2025 12:50 AM | Updated on Apr 30 2025 12:50 AM

నేడు పాలిసెట్‌

నేడు పాలిసెట్‌

● 33 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ● జిల్లాలో హాజరుకానున్న 13,157 మంది విద్యార్థులు

మురళీనగర్‌: జిల్లాలో బుధవారం జరిగే పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 కేంద్రాల్లో 13,157 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విశాఖపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్‌, పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, భీమిలి మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలను కో–ఆర్డినేటింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. విశాఖ కేంద్రం పరిధిలో 22, పెందుర్తి పరిధిలో 5, భీమిలి పరిధిలో 6 కేంద్రాలు ఉన్నాయి. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ కో–ఆర్డినేటింగ్‌ ఆఫీసరుగా కె.నారాయణరావు, పెందుర్తి కోఆర్డినేటర్‌గా ప్రిన్సిపాల్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, భీమిలి కోఆర్డినేటర్‌గా ప్రిన్సిపాల్‌ జి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల కోసం తాగునీరు, వైద్య సౌకర్యాలు, ఫ్యాన్లు వంటి కనీస ఏర్పాట్లు చేశారు. నిరంతర వి ద్యుత్‌ సరఫరా, అవసరమైతే బస్సు సౌకర్యం కోసం సంబంధిత శాఖలకు సమాచారం అందించారు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌, రబ్బరు, పెన్సిల్‌, షార్ప్‌నర్‌ మాత్రమే తీసుకురావాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటివి పూర్తిగా నిషేధం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్‌ రాని వారు సంబంధిత కో–ఆర్డినేటింగ్‌ కేంద్రాన్ని సంప్రదించాలని డాక్టర్‌ కె.నారాయణరావు సూచించారు. జిల్లా పరిశీలకుడు, టెక్నికల ఎడ్యుకేషన్‌ అకడమిక్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కె.విజయభాస్కర్‌, విశాఖ కోఆర్డినేటింగ్‌ సెంటర్‌ పరిశీలకుడు జి.దామోదరరావు మంగళవారం ఎన్‌ఏడీ భాష్యం, ఎంవీపీ కాలనీ ఏఎస్‌ రాజా మహిళా డిగ్రీ కాలేజీ, వీఎంఆర్డీఏ పార్కు గాయత్రి విద్యాపరిషత్‌–ఎంఎల్‌బీటీ పాఠశాల తదితర కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల ఇన్విజిలేటర్లకు పలు సూచనలిచ్చారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఉన్నందున దూర ప్రాంతాల విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement