
ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు రద్దు చేయాలి
ఆరిలోవ: ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం చేసిన భూ కేటాయింపుల్ని వెంటనే రద్దు చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్ డిమాండ్ చేశారు. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసలు చొప్పున 59.6 ఎకరాలు భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం మద్దిలపాలెం జోన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆ భూ కేటాయింపు రద్దు చేయాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దారు రాజేష్కు వినతి పత్రం అందించారు. అనంతరం కుమార్ మీడియాతో మాట్లాడుతూ..ఉర్సా అనేది కూటమి నాయకులకు బినామీ కంపెనీ అని తెలిపారు. విశాఖలో ఉన్న నిరు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి భూములు లేవని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఇలాంటి బోగస్ కంపెనీకి కాపులుప్పాడ ప్రాంతంలో రూ.వేల కోట్లు విలువచేసే 59.6 ఎకరాల భూమి కేటాయించడం ఆక్షేపణీయమన్నారు. ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు డి.అప్పలరాజు, వి.నరేంద్రకుమార్, పి.శంకరరావు, కె.కుమారి, నాయుడు, రాజ్కుమార్, లక్ష్మి, రమణ పాల్గొన్నారు.