
వేటకు వెళ్లిన మత్స్యకారుడి మృతి
తగరపువలస: భీమిలి పట్టణ నదీ సాగర సంగమ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోయవీధికి చెందిన మత్స్యకారుడు చింతపల్లి తాతారావు(65) ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. ప్రతిరోజూ భీమిలి జోనల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో వేటకు వెళ్లడం అతనికి అలవాటు. అందులో భాగంగానే సోమవారం సాయంత్రం 4.30 సమయంలో వేటకు వెళ్లాడు. అయితే అలల తాకిడికి అతను మునిగి చనిపోయినట్టు భావిస్తున్నారు. అతని మృతదేహం మంగళవారం ఉదయం భీమిలి మండలం అన్నవరం పంచాయతీ ఎర్రయ్యపాలెం తీరానికి చేరింది. తాతారావుకు భార్య పైడమ్మ, కుమారులు పోలిరాజు, అప్పన్న, నూకరాజు, కుమార్తె నందిని ఉన్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాతారావు మృతితో బోయవీధిలో విషాదచాయలు అలముకున్నాయి.