
మేయర్గా పీలా ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ మేయర్గా కూటమి కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ను కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మేయర్ ఎన్నికకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. పీలా శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. పీలా శ్రీనివాస్ ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ప్రకటించి నియామక పత్రం అందజేశారు. అనంతరం పలువురు అధికారులు పీలాచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పీలాను అభినందించారు.
నిస్వార్థంగా పనిచేస్తా..
మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన పీలా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మంచి నాయకత్వం నడుపుతానని, నాయకత్వానికి విలువ చూపుతానన్నారు. నిస్వార్థంగా విశాఖ ప్రజలకు సేవలందిస్తానన్నారు.
అంతా పావు గంటలోనే..
ఉదయం 10.55 గంటలకు సభ్యులందరూ(కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ) సభలో ఆశీనులయ్యారు. 11 గంటలకు ఎన్నికల అధికారి మయూర్ అశోక్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. 5 నిమిషాల్లో ఎన్నికకు సంబంధించి నియమ నిబంధనలు సూచించారు. మరో 5 నిమిషాల్లో మేయర్ ఎన్నిక తంతు పూర్తి చేశారు.
రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్
మేయర్గా పీలా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే టీడీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. వాహన చోదకులను ఇబ్బందులకు గురి చేశారు. ట్రాఫిక్ నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయారు. వీరంగం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకింత విసిగించారు. సంబరాలు చేసుకోవచ్చు.. కానీ పౌరులను ఇబ్బంది పెట్టి చేసుకోవడం సమంజసం కాదని పలువురు నగర పౌరులు బాహాటంగానే చెప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి జీవీఎంసీ ప్రధాన ద్వారానికి వచ్చే మార్గాన్ని ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీకి చెందిన కాళ్ల శంకర్ నువ్వు ఎవరంటూ అక్కడున్న మహిళా ట్రాఫిక్ పోలీసుపై చిందులేశారు. నువ్వు నన్ను ఆపుతావా.. అంటూ కారును స్పీడ్గా దూసుకుపోవడంపై పలువురు మండిపడ్డారు.
గ్రేటర్ 3వ మేయర్గా..
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 7వ మేయర్గా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు 3వ మేయర్గా పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. విశాఖ తొలి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి, రెండో మేయర్గా డి.వి.సుబ్బారావు, మూడో మేయర్గా సబ్బం హరి, నాల్గో మేయర్గా రాజాన రమణి కొనసాగగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత పులుసు జనార్దనరావు తొలి మేయర్గా, రెండో మేయర్గా గొలగాని హరి వెంకటకుమారి కొనసాగారు. మూడో మేయర్గా పీలా శ్రీనివాస్ ఇప్పుడు ఎన్నికయ్యారు.