
ట్రాఫిక్ పోలీసులకు కూల్ జాకెట్లు
విశాఖ సిటీ : ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం కలిగేలా కూల్ జాకెట్లు అందిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ సమావేశంలో మందిరంలో ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండ వేడికి గురికాకుండా సిబ్బందికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేసినట్లు చెప్పారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ‘ట్రాఫిక్ ఎక్స్ పో’కు విశాఖ ట్రాఫిక్ విభాగం నుంచి ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను పంపించామన్నారు. అక్కడ హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన 98ఎఫ్ అనే కంపెనీ వారు ‘కూల్ జాకెట్లను‘ ప్రదర్శించినట్లు చెప్పారు. నగరంలో కొందరు దాతల సహాయంతో రూ.5 లక్షలు విలువైన 200 కూల్ జాకెట్లను గురుగ్రామ్ నుంచి తెప్పించినట్లు వెల్లడించారు. ఈ జాకెట్లను సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ముంచి తీస్తే వాటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుందని వివరించారు. అవి ధరించిన సిబ్బంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొంది ట్రాఫిక్ విధులు సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. అలాగే వీటిని శీతాకాలంలో సాధారణంగా వాడుకోవచ్చన్నారు. వీటికి రేడియం స్టిక్కరింగ్ ఉండడంతో రాత్రిపూట కూడా ధరించి విధులు నిర్వహించవచ్చని తెలిపారు. అనంతరం ఈ కూల్ జాకెట్లను ట్రాఫిక్ సిబ్బందికి అందజేశారు.