
జాబితాలో ప్రజాకవుల పేర్లు లేకపోవడం దారుణం
డాబాగార్డెన్స్: తెలుగునాట మహానీయుల జయంతులు, వర్ధంతులు నిర్వహించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జాబితాలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గుర్రం జాషువా వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడంపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి ఆవేదన వ్యక్తం చేశారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞానకేంద్రంలో సోమవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర సాహిత్యవేత్తలు, రచయితల ఇష్టాగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదా కావాలనే చేశారా? అన్నది బేరీజు వేసుకోవాలన్నారు. నిజంగా కావాలని చేసి ఉంటే విచారకరమన్నారు. మతపరమైన కోణంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వాస్తవిక చరిత్రను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని, అందుకు నిదర్శనమే ఈ అధికారిక జాబితా అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని, కేంద్రంలోని ప్రధాన మీడియా ఛానల్స్, పత్రికలను బీజేపీ ప్రభుత్వం నియంత్రిస్తూ వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా చేస్తోందని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సాహితీ స్రవంతి సభ్యులు చలపతి, రామారావు పాల్గొన్నారు.