
అదే అర్జీ మళ్లీ వస్తే.. అధికారులదే బాధ్యత
బీచ్రోడ్డు: ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవి పునరావృతం కాకుండా శాశ్వతమైన, నాణ్యమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్ఎస్) కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పూర్తిస్థాయి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చా రు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదుదారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. ఒక అర్జీని పరిష్కరించామని నివేదించే ముందు సంబంధిత అధికారి తప్పనిసరిగా అర్జీదారుడితో మాట్లాడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, జీవీఎంసీ శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నందున.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆదేశించారు. అధికారులు తమ శాఖల్లో ప్రతి రోజూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతిపై సమీక్ష నిర్వహించాలన్నారు. ఒకే సమస్యపై అర్జీ మళ్లీ వస్తే సంబంధిత జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. పరిష్కరించిన అర్జీలపై లబ్ధిదారుల స్పందన సేకరించి, మొబైల్ యాప్లో నమోదు చేయాలని, ‘ఎన్రోల్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ హౌస్హోల్డ్ సర్వే’కు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
252 అర్జీల స్వీకరణ
సోమవారం జరిగిన ప్రజావేదికకు మొత్తం 252 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 122, జీవీఎంసీ 57, పోలీసు శాఖ 11, ఇతర విభాగాలకు చెందిన 62 వినతులు ఉన్నాయి. కలెక్టర్తో పాటు డీఆర్వో భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథూర్, జీవీఎంసీ సిటీ ప్లానింగ్ అధికారి ధనుంజయరెడ్డి తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మత్స్యకార భృతి రాలేదు
నా భర్త 25 ఏళ్లుగా చేపల వేట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందించిన వేట నిషేధ భృతి నా భర్తకు రాలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏటా చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వ సాయం అందేది. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రాలేదు. దీనిపై విచారించి, భృతి అందేలా చూడాలి.
– కె.కొర్లమ్మ, ఏగువ పేట, భీమిలి
సర్టిఫికెట్ ఇప్పించండి
నాకు 2023లో వెన్నుపూస ఆపరేషన్ జరిగింది. అయినా ఇంకా నడవలేకపోతున్నాను. మూత్ర విసర్జన, మాల విసర్జన కూడా సరిగ్గా అవ్వడం లేదు. దీంతో కేజీహెచ్ వైద్యులను సంప్రదించగా.. శస్త్రచికిత్స ఆలస్యం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ఆ విషయాన్ని సర్టిఫై చేసి ఓ లేఖపై రాసి ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదు. శస్త్రచికిత్స జరిగినట్లు సర్టిఫికెట్ ఇప్పించగలరు.
– కె.రమణ, వేములవలస, ఆనందపురం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ స్పష్టీకరణ

అదే అర్జీ మళ్లీ వస్తే.. అధికారులదే బాధ్యత

అదే అర్జీ మళ్లీ వస్తే.. అధికారులదే బాధ్యత