
అధికారులు వార్డుల్లో పర్యటించాలి
మేయర్ పీలా శ్రీనివాస్ ఆదేశం
డాబాగార్డెన్స్: నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మేయర్ పీలా శ్రీనివాస్ సోమవారం జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్యం, ప్రజారోగ్యం, వీధిలైట్లు, తాగునీరు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటించి, పారిశుధ్య మెరుగుకు కృషి చేయాలన్నారు. వేసవి దృష్ట్యా తాగునీరు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. జీవీఎంసీలో అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు గీతలు, హద్దులు దాటి విధులు నిర్వహించరాదన్నారు. జీవీఎంసీ డాష్ బోర్డ్, సిటీ ఆపరేషన్ సెంటర్ సమాచారం నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తాను ప్రతి రోజూ వార్డుల్లో పర్యటిస్తానని తెలిపారు. ఇంతవరకు టెండర్లు తీసుకొని పనులు చేపట్టలేని వారిపై దృష్టి సారించి సకాలంలో పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి విభాగానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాదరాజు మేయర్కు వివరించారు. చలివేంద్రాలు పటిష్టంగా, పరిశుభ్రతతో నిర్విహించాలని ప్రధాన ఇంజనీర్కు మేయర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, యూసీడీ పీడీ పీఎం సత్యవేణి పలువురు అధికారులు పాల్గొన్నారు.