
మే 20న జాతీయ సమ్మె
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల రద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మే 20న జాతీయ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు, ఏఐటీయూసీ నాయకుడు డి.ఆదినారాయణ, ఐఎన్టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, సీఎఫ్టీయూఐ అధ్యక్షుడు ఎన్.కనకారావు, హెచ్ఎంఎస్ నాయకుడు గణపతిరెడ్డి, ఏపీఎఫ్టీయూ నాయకుడు దేవా మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, దీని వల్ల నిరుద్యోగం పెరిగి, ఉద్యోగ భద్రత తగ్గిందని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ కోడ్స్ అమలైతే పని గంటలు 8 నుంచి 15కి పెరిగే ప్రమాదం ఉందని, కార్మికులు సంఘం నెలకొల్పడం, సమ్మె చేయడం, వేతనాల కోసం పోరాడే హక్కులు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు, బ్యాంకులు మొదలైనవాటిని ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, అగ్నిపథ్ రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మే 3 లోపు పరిశ్రమల వారీగా సమ్మె నోటీసులు ఇవ్వాలని, 10 లోపు జిల్లా, మండల, పట్టణ స్థాయి సదస్సులు నిర్వహించాలని, 16 నుంచి 19 వరకు ప్రచార యాత్రలు చేపట్టాలని, మే 20న భారీ ప్రదర్శనలు, సభలు నిర్వహించాలని కార్యాచరణను ప్రకటించారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోని రైతు సంఘాలు కూడా గ్రామీణ హర్తాళ్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్కేఎస్వీ కుమార్, బి.నాగభూషణం, మన్మధరావు, ఆయా యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల పిలుపు