
నేడే మేయర్ ఎన్నిక
● కూటమి అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ మేయర్ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ను ప్రభుత్వం నియమించింది. కాగా కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయనకు బీ–ఫారం అందజేశారు. మరోవైపు మేయర్ ఎన్నిక ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఉదయం 10.30 గంటలకు గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు.