
రెడ్ సిగ్నల్
గ్రీన్ షెల్టర్లకు
● మొక్కుబడిగా చలివేంద్రాల నిర్వహణ ● పట్టించుకునే అధికారి లేకపోవడంతో ఎండల బారిన ప్రజలు ● మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
డాబాగార్డెన్స్: ఎండలు మండుతున్నాయి. నానాటికీ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు మొదలైన భానుడి ప్రతాపం సాయంత్రం 6 గంటలకు గాని తగ్గట్లేదు. ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏప్రిల్లోనే ఇలా ఉంటే.. ఇక మే నెలలో ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, దైనందిన విధుల్లో భాగంగా రోడ్లపైకి వచ్చే ప్రజలకు అవసరమైన కనీస వసతుల కల్పనలో కూటమి పాలకులు విఫలమయ్యారనే చెప్పొచ్చు.
గాడి తప్పిన జీవీఎంసీ పాలన
జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేరు. మూడు నెలలుగా ఇన్చార్జ్ కమిషనర్ పాలనలోనే జీవీఎంసీ ఈదుతోంది. దీంతో జీవీఎంసీ అధికారుల్లో జవాబుదారీ తనం కరువైంది. 35 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా, నగరవాసులకు కనీస వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం ఫెయిలైందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఆస్తి పన్నులు చెల్లించకపోతే జప్తు చేస్తామని బెదిరిస్తున్న అధికారులు, మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రీన్షెల్టర్లు, చలివేంద్రాలపై దృష్టి సారించకపోవడంపై మండిపడతున్నారు. గతంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో 98 వార్డుల్లోని ప్రధాన కూడళ్లు, ఐలాండ్లు, జాతీయ రహదారుల వెంబడి, ట్రాపిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద చలివేంద్రాలు, గ్రీన్షెల్టర్లను విరివిగా ఏర్పాటు చేసేవారు.
గతంలో ఇలా..
గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ పరిధిలో చలివేంద్రాలతో పాటు 63 గ్రీన్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. జోన్–1 పరిధిలో 10 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–2లో 13 చలివేంద్రాలు, 7 గ్రీన్ షెల్టర్స్, జోన్–3లో 26 చలివేంద్రాలు, 4 గ్రీన్ షెల్టర్స్, జోన్–4లో 25 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్, జోన్–5ఏ పరిధిలో 29 చలివేంద్రాలు, 5 గ్రీన్షెల్టర్స్, జోన్–5బీ పరిధిలో 13 చలివేంద్రాలు, 3 గ్రీన్షెల్టర్స్, జోన్–6 పరిధిలో 31 చలివేంద్రాలు, 16 గ్రీన్షెల్టర్స్, జోన్–7 పరిధిలో 12 చలివేంద్రాలు, 12 గ్రీన్షెల్టర్స్, జోన్–8 పరిధిలో 18 చలివేంద్రాలు, 6 గ్రీన్షెల్టర్స్ ఏర్పాటు చేసి పాదచారుల దాహార్తి, వాహనచోదకులకు ఉపశమనం కల్పించారు.
మొక్కుబడిగా హరితాశ్రయాలు
నగరంలో పలు ప్రాంతాల్లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన హరితాశ్రయాలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ కొరవడటంతో లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి చుట్టూ ఆకుపచ్చని తెరను సరిగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండ సమయంలో దీనిలో కూర్చునే అవకాశం ఉండడం లేదు. కొన్ని చోట్ల శునకాలు వీటిలో తిష్టవేస్తున్నాయి. అధికారులు హరితాశ్రయాలలో తాగునీరు సైతం ఏర్పాటు చేస్తే నగరవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నగర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా..
నగర ప్రజల శ్రేయ స్సు దృష్ట్యా రూ.కోటితో 177 చలివేంద్రాలు, 63 గ్రీన్ షెల్టర్స్ను గతంలో ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఐలాండ్లు, హైవే, ముఖ్య కూడళ్ల వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశాం. అధికార యంత్రాంగం వీటిని సక్రమంగా నిర్వహించాలి.
– గొలగాని హరి వెంకటకుమారి, మాజీ మేయర్

రెడ్ సిగ్నల్

రెడ్ సిగ్నల్