
వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే భవిత
● అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ పార్టనర్ శివకుమార్ ● ఘనంగా ఐఐఎం ఈఎంబీఏ ప్రత్యేక స్నాతకోత్సవం ● 124 మందికి పట్టభద్రులకు అవార్డులు
బీచ్రోడ్డు: వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం వల్ల వ్యక్తిగత వృద్ధితోపాటు సంతృప్తిని పొందవచ్చని అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఆపరేటింగ్ పార్టనర్ డి.శివకుమార్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎం) ఈఎంబీఏ ప్రత్యేక స్నాతకోత్సవాన్ని శనివారం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ–విలువను స్వతంత్రంగా నిర్వచించుకోవాలన్నారు. పోలికల ఒత్తిళ్లను నిరోధించాలని సూచించారు. మోసపూరిత సిండ్రోమ్ను అధిగమించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఐఐఎం గవర్నర్ల బోర్డు సభ్యుడు ప్రొఫెసర్ జనత్ షా మాట్లాడుతూ వ్యాపారం ద్వారా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించడం, వాటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ డైరెక్టర్ నివేదికను సమర్పించారు. ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేసేందుకు ప్రత్యేక స్నాతకోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు (పీజీపీఎంసీఐ)ల్లో పనిచేస్తున్నవారు కోసం ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (ఈఎంబీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సులను వీరంతా దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. అభ్యర్థుల్లో సుమారు 70 శాతం మంది వ్యూహాత్మక ఆలోచన, విస్త్తృత వ్యాపార దృక్పథాలు, మెరుగైన విశ్వాసం, విశ్వసనీయతలో మెరుగుదలను నివేదించారని పేర్కొన్నారు. దాదాపు 60 శాతం మంది తమ నాయకత్వ సామర్థ్యాల్లో వృద్ధిని చూశారన్నారు. 27 శాతం మంది గ్రాడ్యుయేట్లు ప్రమోషన్లు లేదా కొత్త అవకాశాల ద్వారా కెరీర్ పురోగతిని సాధించారన్నారు.
ఇద్దరికి గోల్డ్ మెడల్
ఈఎంబీఏ ప్రోగ్రామ్ నుంచి మొత్తం 124 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారు. ఈ కోర్సులో అగ్రస్థానంలో నిలిచిన నవనీత్ బత్రాకు, రెండో స్థానంలో నిలిచిన అనిర్బన్ దత్తాకు గోల్డ్ మెడల్ను అందజేశారు. వేడుకలో సుమారు 200 మంది గ్రాడ్యుయేట్లను సత్కరించారు.