
అవిశ్వాసానికి రండి.. రూ.కోటి ఇస్తాం!
● డిప్యూటీ మేయర్ కోసం కూటమి కుయుక్తులు ● మహిళా కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్ ● స్టేట్ డైరెక్టర్ పోస్టులు ఇస్తామంటూ ఫోన్లు ● అయినా తలొగ్గని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు
సాక్షి, విశాఖపట్నం/డాబాగార్డెన్స్: మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మ్యాజిక్ ఫిగర్ కోసం కూటమి నేతలు ఎలాంటి ప్రయత్నాలు చేశారో.. ఇప్పుడు డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాస తీర్మానంలోనూ అదే తరహా పరిస్థితి కొనసాగింది. గతంలో మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని నెగ్గించుకుని, ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి 74 మంది కార్పొరేటర్ల బలం అవసరం కాగా, దాన్ని సాధించేందుకు చివరి నిమిషం వరకు కార్పొరేటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 74 మంది బలంతో ఆ అవిశ్వాసం నెగ్గింది. శనివారం జరిగిన డిప్యూటీ మేయర్ పీఠం విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. డిప్యూటీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి 74 మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందేమోనన్న భయంతో కూటమి నేతలు చివరి నిమిషం వరకు ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడ్డారు. తమ వద్ద ఉన్న కార్పొరేటర్లపై పూర్తి విశ్వాసం లేని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి చెందిన మహిళా కార్పొరేటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. కొందరు మహిళా కార్పొరేటర్లకు ఫోన్లు చేసి, అవిశ్వాస ఓటింగ్కు హాజరై, డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే బంపర్ ఆఫర్ ఇస్తామంటూ ఆశ చూపారు. రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవిని కల్పిస్తామని, అదనంగా కోటి రూపాయలు కూడా ఇస్తామని ఫోన్లలో బేరసారాలు జరిపారు. వెంటనే నగదు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాగైనా వచ్చి ఓటు వేయాలని కోరారు. అయితే, కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్ సీపీ మహిళా కార్పొరేటర్లు ఏమాత్రం లొంగలేదు. వారి ఆఫర్లను గట్టిగా తిరస్కరించారు. పార్టీ గుర్తుపై గెలిచి, ఇలాంటి వాటికి లొంగే దుర్బుద్ధి తమకు లేదని ఘాటుగా బదులివ్వడంతో కూటమి నేతలు తొకముడిచారు. చివరికి తమ శిబిరంలో ఉన్న 74 మంది కార్పొరేటర్లను బతిమాలుకుని డిప్యూటీ మేయర్పై అవిశ్వాస ఓటింగ్కు తీసుకొచ్చారు. ఆ 74 మందిని కాపాడుకోవడానికి చివరి నిమిషం వరకు అష్టకష్టాలు పడిన కూటమి.. అవిశ్వాసంలో కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించి బతుకు జీవుడా అని ఊపిరిపీల్చుకుంది. కాగా.. డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని కూడా వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ కార్పొరేటర్లు బహిష్కరించారు. గుర్తింపు కార్డు ఉన్నవారికే జీవీఎంసీ ప్రాంగణంలోకి అనుమతిస్తామని కలెక్టర్ ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో ఆయన ఆదేశాలు అమలు కాలేదు. కూటమి చోటా నాయకులు సైతం దర్జాగా జీవీఎంసీలోకి ప్రవేశించడం గమనార్హం.