
రోజ్గార్ మేళాలో 278 మందికి నియామక పత్రాలు
తాటిచెట్లపాలెం: దేశవ్యాప్తంగా 15వ రోజ్గార్ మేళా శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగింది. ఇందులో భాగంగా విశాఖపట్నం సాలగ్రామపురంలోని సాగరమాల పోర్ట్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా మాట్లాడుతూ, యువత దేశ నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నప్పుడే దేశం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుందని, ప్రపంచ వేదికపై గుర్తింపు లభిస్తుందని అన్నారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 278 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్, జీఎస్టీ జోన్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్, సీజీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి.ఆనంద్కుమార్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల(నాసిన్) అదనపు డైరెక్టర్ జనరల్ ఈదర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.